గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (16:45 IST)

చంపేసి నేరం మావోయిస్టులపై నెట్టేందుకు కుట్ర.. రేవంత్ ప్రచారం రద్దు

తనను చంపేసి నేరాన్ని మావోయిస్టులపై నెట్టేసేందుకు పక్కాస్కెచ్ వేశారనీ, అందుకే తన ఎన్నికల ప్రచారాన్ని మూడు రోజుల పాటు వాయిదా వేసుకుంటున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
తనకు ప్రాణహాని ఉందని కేంద్ర రాష్ట్ర వర్గాలు హెచ్చరించాయన్నారు. దీంతో తనకు 4+4 భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించిందనీ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు భద్రత కల్పించలేదన్నారు. 
 
ఎన్నికల ప్రచార సమయంలో తనను హత్య చేసిన, దాన్ని మావోయిస్టులపై నెట్టేందుకు కుట్ర పన్నారనీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఖమ్మం జిల్లాలో తాను చేయాల్సిన ఎన్నికల ప్రచారాన్ని మూడు రోజుల పాటు వాయిదా వేసుకున్నట్టు తెలిపారు. 
 
తెలంగాణ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు, సభలకు చివరి నిమిషంలో అనుమతులు మంజూరు చేస్తూ పార్టీ నేతలను, కార్యకర్తలను మానసిక్షోభకు గురిచేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 
 
ఇదిలావుండగా, సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రేవంత్ రెడ్డి గురువారం హైకోర్డు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రేవంత్ రెడ్డికి తక్షణం 4+4 భద్రత కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.