1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 1 మే 2024 (12:36 IST)

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

Mangoes
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బోరబండలోని రెండు పండ్ల గోదాముల్లో హైదరాబాద్ పోలీసుల వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించి ఇథిలిన్‌తో కృత్రిమంగా పండించిన సుమారు 4,800 కిలోల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. బోరబండలోని హెచ్‌ఎఫ్ నగర్‌లోని ఓ పండ్ల గోదాములో మేనేజర్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ల మోయిజ్‌ను అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కృత్రిమంగా పండించిన మామిడి పళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ట్రేలో 20 కిలోల పండ్లను, పలు ఇథిలిన్ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
 
అలాగే హైదరాబాద్‌లోని బోరబండలోని సంజయ్ నగర్‌కు చెందిన 47 ఏళ్ల పండ్ల వ్యాపారి సాదిక్‌ను అరెస్టు చేసి 80 ట్రేల మామిడి పండ్లను, రైప్నింగ్ ఏజెంట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని పండ్ల సరఫరాదారుల బృందం ఈ సీజన్‌లో మామిడితో సహా వివిధ పండ్ల దుకాణాలు, జ్యూస్ సెంటర్‌లకు పండ్లను అందజేస్తుంది. అయితే, పండ్లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో, ఈ సరఫరాదారులు ఇథిలిన్ వంటి కృత్రిమంగా పండించే రసాయనాలను ఉపయోగిస్తున్నారు.
 
హైదరాబాద్ అధికారుల వారి ప్రకటన ప్రకారం, ఈ రసాయనాలు అధిక మొత్తంలో వాడినప్పుడు చర్మం కాలినట్లు గాయాలు అవుతాయి. అలాగే చికాకు, వాపు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. ఇలా కృత్రిమంగా పండించిన మామిడి పండ్లలో వుండే ఆర్సెనిక్‌ను పీల్చడం వల్ల హెవీ మెటల్ పాయిజనింగ్, ఇతర నరాల సమస్యలు వస్తాయి. కనుక మామిడి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి.