పాలమూరు బయోసైన్సెస్ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?
భారతదేశంలో అతిపెద్ద జంతు సంరక్షణ నెట్వర్క్ అయిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్(ఎఫ్ఐఏపిఓ)లో సభ్యులుగా ఉన్న ఇరవై ప్రముఖ జంతు సంరక్షణ సంస్థలు, జంతువులపై తీవ్ర హింస, పదేపదే నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాలమూరు బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ను శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ కమిటీ ఫర్ ది కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ యానిమల్స్(సిసిఎస్ఈఏ)కి విజ్ఞప్తి చేశాయి.
సమాఖ్య తరపున ఎఫ్ఐఏపిఓ సీఈఓ భారతి రామచంద్రన్ మాట్లాడుతూ, పాలమూరు బయోసైన్సెస్ వద్ద జంతువులు పడుతున్న బాధలను అంతం చేయడానికి సిసిఎస్ఈఏ ఆలస్యం చేయకుండా చర్య తీసుకోవాలని తాము కోరుతున్నాము. శాస్త్రీయ పురోగతికి క్రూరత్వం మూల్యం కాదని మనం నిర్ధారించుకోవాలన్నారు.
తెలంగాణలోని మహబూబ్నగర్లోని భూత్పూర్ మండలంలో ఉన్న పాలమూరు బయోసైన్సెస్, జాతీయ చట్టాలు ఉల్లంఘిస్తూ జంతువులపై తీవ్రమైన, వ్యవస్థాగత హింసకు పాల్పడుతోంది. వీడియో, ఫోటోగ్రాఫిక్ ఆధారాలు వెల్లడించే దాని ప్రకారం 800 కుక్కలను ఉంచడానికి రూపొందించబడిన సౌకర్యాలలో దాదాపు 1,500 కుక్కలను నిర్బంధించారు. అలాగే వాటి సంతానోత్పత్తి నిబంధనలనూ ఉల్లంఘిస్తున్నారు. కుక్కలను బలవంతంగా నిర్బంధించడం, బాధాకరమైన పదార్థాలతో ఇంజెక్ట్ చేయడం వంటివి చేస్తున్నారు.
ఇవే కాదు, మరెన్నో విధాలుగా చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించిన జంతు సంరక్షణ సంస్థలు సిసిఎస్ఈఏ వెంటనే పాలమూర్ బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కు జారీ చేయబడిన అన్ని సిసిఎస్ఈఏ రిజిస్ట్రేషన్లు, ఆమోదాలు మరియు బ్రీడింగ్ లైసెన్స్లను రద్దు చేయడంతో పాటుగా కొనసాగుతున్న అన్ని ప్రయోగాలను నిలిపివేయడం, భవిష్యత్తులో జంతువులను ఉపయోగించడం వంటి దరఖాస్తులను తిరస్కరించటం చేయాలని, జీవించి ఉన్న అన్ని జంతువులకు తక్షణ పునరావాసాన్ని కల్పించటం చేయాలని విజ్ఞప్తి చేశాయి.