బలపడుతున్న ఉపరితల ఆవర్తనం : తెలంగాణాలో మళ్లీ కుండపోతవర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన బలపడుతోంది. ఇది శనివారానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా వచ్చేవారం తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా, రాబోయే రెండు మూడు రోజులు పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. వర్షం కురిసే రోజుల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలుల అధికంగా ఉంటాయని హెచ్చరించింది.
ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈ నెల 11 నాటికి అల్పపీడనంగా మారే సూచనలున్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వచ్చేవారం కుండపోత వర్షాలు తప్పవని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
అలాగే శని, ఆదివారాల్లో భద్రాద్రి - కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 9.15 సెం.మీ. వర్షం కురవగా, మల్కలపల్లిలో 7.55 సెం.మీ., నల్లగొండ జిల్లా తిప్పర్తిలో 6.78 సెం.మీ. వర్షపాతం రికార్డయినట్లు అధికారులు తెలిపారు.