1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (12:04 IST)

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను అటకెక్కించిన జగన్ సర్కారు.. తరలిపోతున్న రైల్వే కార్యాలయాలు

indian railway
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావాల్సివుంది. కానీ, ఈ జోన్ ఏర్పాటులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. దీంతో ఈ రైల్వే జోన్ ఏర్పాటు కొలిక్కి రాలేదు. దీంతో ఏపీలోని అనేక రైల్వే శాఖలోని అనేక విభాగాలకు చెందిన కార్యాలయాలు సికింద్రాబాద్‌కు తరలిపోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌లో ఒక్కో విభాగాన్ని విలీనం చేస్తూ, ఇక్కడి కార్యాలయాలను మూసివేస్తున్నారు. 
 
తాజాగా విజయవాడ, తిరుపతిలో ఉన్న రైల్వే కన్‌స్ట్రక్షన్ అకౌంట్స్ కార్యాలయాలను మూసివేసి వాటిని ప్రధాన కేంద్రంలో విలీనం చేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తికావాలని, జనవరి ఒకటి నుంచి వీటి కార్యకలాపాలు సికింద్రాబాద్ నుంచే జరగాలని కొద్దిరోజుల కిందట జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. 
 
విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లలో జరిగే రైల్వే నిర్మాణ పనులు అన్నింటికీ.. కన్‌స్ట్రక్షన్ అకౌంట్స్ విభాగం నుంచి చెల్లింపులు జరిపేందుకు గతంలో విజయవాడ, తిరుపతిలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. నిర్మాణ పనుల బిల్లులను ఈ కార్యాలయాలకు ఆన్‌లైన్‌లో పంపిస్తే, వాటిని పరిశీలించి చెల్లింపులు చేస్తుంటారు. ఇప్పుడు ఈ రెండు కార్యాలయాలు మూసివేయడంపై ఉద్యోగులు విస్తుపోతున్నారు. 
 
తెలంగాణాను వీడటం లేదు.. అవన్నీ పుకార్లే : స్మితా సబర్వాల్ 
 
భారత రాష్ట్ర సమితి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారిణిగా స్మితా సబర్వాల్ చెలామణి అయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలను పర్యవేక్షించారు. ఇపుడు తెలంగాణ రాష్ట్రాన్ని వీడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం.. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్మితా సబర్వాల్‌ను కీలక బాధ్యతల నుంచి తప్పించనున్నారని, అందువల్ల స్మితా సబర్వాల్ ఢిల్లీకి వెళ్లనున్నారే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
దీనికికారణం.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై దాదాపు వారం గడుస్తున్నా ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ మాత్రం ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. ప్రభుత్వం మారిన సందర్భంలో కొత్త సీఎంను అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. కానీ, స్మిత సబర్వాల్ తీరుపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆమె డిప్యుటేషన్‌‍పై కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని, ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. కొత్త ఛాలెంజ్‌కు సిద్ధమంటూ ఇటీవల ఆమె చేసిన పోస్ట్ మరింత సంచలనానికి దారి తీసింది.
 
ఈ నేపథ్యంలో స్మిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తాను సెంట్రల్ సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళుతున్నానంటూ కొన్ని మీడియా ఛానెళ్లు ఫేక్ న్యూస్ ప్రసారం చేశాయని, ఇవన్నీ నిరాధారమనిని స్మిత స్పష్టం చేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ తాను రాష్ట్రంలోనే కొనసాగుతానని, ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో విధి నిర్వహణ తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు.