కర్నూలు ఘటనపై సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు.. వారు ఉగ్రవాదులు కాక ఇంకేమవుతారు..?
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. మద్యం తాగి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీసేవాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కరు చేసిన నిర్లక్ష్యం 20మంది ప్రాణాలు బలితీసుకుంది. మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకునే వాళ్లు ఉగ్రవాదులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు. వాళ్లు చేసిన తప్పు వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయని సజ్జనార్ ఎక్స్ ద్వారా మండిపడ్డారు. సరదాలు, జల్సాల కోసం ఇతరుల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
"సమాజంలో మన చుట్టూ తిరిగే ఇటువంటి ఉగ్రవాదులు, మానవ బాంబుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీళ్ల కదలికలపై వెంటనే డయల్ 100కి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోడ్ల మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. మాకెందుకులే అని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణ నష్టం జరుగుతుందంటూ'' సజ్జనార్ పోస్టు చేశారు.