తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్
తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని చెక్పోస్టులను రద్దు చేస్తున్నట్టు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణా శాఖ చెక్పోస్టుల్లో అవినీతి రవాణా అవుతోంది. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని యధేచ్చగా అక్రమ వసూళ్లు కొనసాగిస్తూ వచ్చారు.
నిజానికి రాష్ట్రంలోని రవాణాశాఖ చెక్ పోస్టులను రద్దు చేస్తూ జూలై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజులు ఆలస్యంగా జీవో జారీ అయింది. ఉత్తర్వులు వచ్చి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా చెక్ పోస్టులను ఇంకా తొలగించలేదు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చెక్ పోస్టుల అవసరం దాదాపుగా తగ్గిపోయింది. కేంద్రం సూచనల మేరకు దేశంలోని అనేక రాష్ట్రాలు సంవత్సరాల సంవత్సరాల క్రితమే చెక్పోస్టులను రద్దు చేశారు. కానీ తెలంగాణాలో కొనసాగుతున్నాయి.
యేడాదిన్నర క్రితమే తెలంగాణాలో చెక్ పోస్టుల రద్దుకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. కొందరు అధికారుల బలమైన ఒత్తిళ్ల కారణంగా ఇన్నాళ్లూ ఆ నిర్ణయం వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు రెండు నెలల క్రితమే జీవో జారీ అయింది. అయినా అవినీతి అధికారుల తీరుమాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులు రద్దు చేయాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.