1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (20:09 IST)

మీ ప్రశ్నలకు ఒకటి రెండు రోజుల్లోనే సమాధానాలు వస్తాయ్ : షర్మిల

sharmila
కాంగ్రెస్ పార్టీతో పని చేయాలని ఇదివరకే నిర్ణయించుకున్నామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు జరిపేందుకు బుధవారం ఢిల్లీకి వెళుతున్నానని, ఒకటి రెండు రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ, 
 
కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణాలో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చడంలో తమ పార్టీ కీలక భూమికను పోషించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్లో 31 చోట్ల పది వేల ఓట్ల కంటే తక్కువ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీనికి కారణం తమ పార్టీ పోటీకి దూరంగా ఉండటం వల్లే. ఆ కృతజ్ఞతాభావం కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో ఉందన్నారు. పైగా, దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. ఇదే అంశంపై బుధవారం చర్చలు జరిపేందుకు ఢిల్లీకి వెళుతున్నానని, మీడియా మిత్రులు అడిగే అన్ని ప్రశ్నలకు రెండు మూడు రోజుల్లో సమాధానాలు లభిస్తాయని ఆమె చెప్పారు.