1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (11:00 IST)

నిజాం విలీనం.. ఏపీ మొదటి సీఎం ప్రమాణ స్వీకారం.. ఫోటో

First AP CM
First AP CM
నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో ప్రమాణం చేస్తున్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తెలంగాణ విమోచనోద్యమంలో పోరాట వీరులు నిజాంపై ఆయుధాలను ఎక్కుపెడితే, కవులు, కళాకారులు తమ కలాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు. చుర కత్తుల్లాంటి పాటలు, గేయాలతో ప్రజల్లో విప్లవాగ్నిని రగిలించారు. కవులు, అటు కళాకారుల తెలంగాణ సాయుధ పోరాటానికి తమవంతుగా సమిధలను అందించారు. 
 
గ్రామానికో కవి, ఇంటికో కళకారుడన్నట్లు చదువు, సంధ్యలు లేనివారు కూడా పాటలు కట్టి ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. బండెన బండికట్టి పదహారు బండ్లు కట్టి అనే గేయం రాసింది నిరక్షరాస్యుడైన యాదగిరి. ఈ పాట నైజాం సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.  
 
4 జూలై 1946 నాడు జనగామ తాలూకాలోని విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా కడవెండిలో ఆంధ్రమహాసభ కార్యకర్తలు ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపుపై దేశ్‌ముఖ్‌కు తాబేదార్లు కాల్పులు జరపడంతో దొడ్డి కొమురయ్య చనిపోయారు. ఇదే దొడ్డి కొమురయ్య అన్న దొరల దౌర్జన్యాలను భరించలేక అంతకు ముందే ఇస్లామ్‌ మతాన్ని స్వీకరించాడు. దీంతో ఆంధ్రమహాసభ అప్పటి వరకు రైతు సంఘంగా, గుత్పల సంఘంగా పనిచేస్తుంది. ఇది కాస్తా సాయుధ పోరాటానికి తెరలేపింది.
 
ఇది మొదలు నల్లగొండ, వరంగల్‌ జిల్లాలలో సాయుధ పోరాటం ఊపందుకుంది. పోరాటం రెండు జిల్లాలలోనే ప్రధానంగా సాగినా దానికి 'తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం'గా ప్రచారమైంది.  
 
1946 జూలై 4 నుంచి 1948 సెప్టెంబర్‌ 12 వరకు నిజాం పోలీసులు, రజకార్ల చేతిలో నాలుగు వందల మంది ఆంధ్రమహాసభ కార్యకర్తలు, సామాన్య తెలంగాణ ప్రజలు చనిపోయారు. అదే సమయంలో 1948 సెప్టెంబర్‌ 13 నుంచి, 1951 అక్టోబర్‌ 21 (పోరాట విరమణ అక్టోబర్‌ 21న కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. అయినా కొంతమంది పోరాటాన్ని కొనసాగించారు) వరకు దాదాపు నాలుగు వేల మందికి పైగా కమ్యూనిస్టు కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజలు తెలంగాణలో పటేల్‌ సైన్యం, పోలీసుల చేతిలో హతమైనారు. 
 
ఇదే సైన్యం సెప్టెంబర్‌ 13 నుంచి 17 వరకు ఐదురోజుల వ్యవధిలో కొన్ని వేల మందిని మహారాష్ట్ర, కర్నాటకలో అత్యాచారం చేసి, చంపి బావులలో వేశారని నెహ్రూ ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్‌ కమిటీ నివేదించింది.
  
హైదరాబాద్‌ కడుపున కమ్యూనిస్టు కాన్సర్‌ని తొలగించేందుకే పోలీసు చర్య జరిపామని చెప్పారు. పటేల్‌ సైన్యం వచ్చి విజేతగా నిలిచిన సెప్టెంబర్‌ 17ని పండుగగా జరుపుకుంటున్నారు.