1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (21:54 IST)

థియేటర్లను మూతవేసేది లేదు.. థియేటర్ల మీద ఆంక్షలపై సర్కారు క్లారిటీ

సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల కావాల్సి వున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిశారు. డిసెంబరులో పలు చిత్రాలు విడుదల కానున్నాయి. 
 
ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, దానయ్యలతో పాటు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, థియేటర్లలో ఆంక్షలు అంటూ జరుగుతున్న ప్రచారం తదితర అంశాలపై వారు మంత్రితో చర్చించారు. 
 
ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోనూ ప్రవేశించిందన్న వార్తలతో సినీ రంగం ఆందోళన చెందుతోంది. దీనికి స్పందించిన మంత్రి త‌ల‌సాని థియేటర్లను మూతవేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. 
 
థియేట‌ర్ల‌కు వెళ్ళి ధైర్యంగా సినిమా చూడండ‌ని చెప్పారు. థియేట‌ర్ల మూత‌, ఆక్యుపెన్సీ త‌గ్గింపు ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని తెలిపారు. అలాంటి ఆలోచ‌న‌లు ప్ర‌భుత్వానికి లేవ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.