శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (13:13 IST)

'యూ ఇడియట్' అంటూ కేటీఆర్‌ను తిట్టిన బీజేపీ నేత!

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ శర్మ యూ ఇడియట్ అంటూ తిట్టారు. దీనికి కేటీఆర్ మాత్రం ఘాటుగా స్పందించలేదు. సార్.. అంటూ మర్యాదగా సంబోధిస్తూ గట్టిగానే కౌంటరిచ్చారు. అసలు వీరిద్దరి మధ్య ఎందుకు వివాదం జరిగిందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
‘లెట్స్‌ టాక్‌ వ్యాక్సినేషన్‌’ యాష్‌ ట్యాగ్‌తో మంత్రి కేటీఆర్‌ ఆదివారం సాయంత్రం ప్రారంభించిన ట్విటర్‌ చాట్‌లో ఈ వివాదం చోటుచేసుకుంది. ఈ చర్చలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రం వ్యాక్సిన్లకు ఆలస్యంగా ఆర్డర్లు ఇస్తోందంటూ మండిపడ్డారు.
 
‘భారత్‌ వ్యాక్సిన్‌ హబ్‌గా ఉన్నప్పుడు ఇక్కడ డిమాండ్‌ - సరఫరా మధ్య అంతరం ఎందుకు ఉంది..? దీనిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మిగతా దేశాలు 2020 ప్రథమార్థంలోనే టీకాలకు ఆర్డర్లు ఇచ్చినపుడు, భారత ప్రభుత్వం ఎందుకు ఆలస్యంగా మేల్కొంది..?’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 
 
దీనిపై బీజేపీ నేత ఖేమ్‌ చంద్‌ స్పందించారు. ‘‘యూ ఇడియట్‌.. ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేస్తావా..? సుమారు 17.5 కోట్ల మందికి వ్యాక్సిన్‌ తొలి డోసు ఇచ్చి ప్రపంచంలోనే ముందంజలో ఉన్నాం. మొత్తంగా 22.37 కోట్ల మందికి టీకా ఇచ్చాం’’ అని మంత్రి కేటీఆర్‌పై బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్‌ చంద్‌ శర్మ మండిపడ్డారు.
 
ఆయన ట్వీట్‌కు కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘సార్‌.. నేనూ మీలా మాట్లాడగలను. కానీ అది మా సంస్కృతిలో లేదు. ఇజ్రాయిల్‌ జనాభాలో 60 శాతం మందికి, అమెరికా 40 శాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాయి. దీనిని బట్టి మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చు. వాస్తవాలను జీర్ణించుకోలేని మీలాంటి వారికి ఇలాంటి విషయాలు కఠినంగానే ఉంటాయి’’ అని కేటీఆర్‌ బదులిచ్చారు.
 
వ్యాక్సినేషన్‌ కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.35 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. భారత్‌లో అందరికీ టీకా ఇవ్వాలంటే సుమారు 272 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అవసరమవుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.