శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:33 IST)

అమ్మాయి కోసం ఆప్తమిత్రుడిని దారుణంగా హత్య చేశాడు, ఎక్కడ?

హేమంత్, సతీష్‌లు ఇద్దరూ మంచి స్నేహితులు. వరంగల్ నగరం గాంధీపురం ఏరియా వీరిది. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. కలిసే తిరిగారు. హేమంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కొన్నిరోజుల పాటు బెంగుళూరులోనే స్థిరపడ్డాడు. సతీష్ మాత్రం చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉండేవాడు. అయితే గత కొన్నిరోజుల ముందు దసరాకు వచ్చి హేమంత్‌ను కలిశాడు సతీష్.
 
ఇద్దరూ కలిసి సరదాగా మద్యం సేవించారు. సతీష్ చిన్నపాటి ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు హేమంత్‌కి. తనతో పాటు బెంగుళూరులో పనిచేసేందుకు రమ్మని కోరాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో తనకు షేర్స్ ఉన్నాయని.. తనతో పాటు వస్తే మంచి ఉద్యోగం ఇస్తానన్నాడు.
 
దీంతో సతీష్ కూడా ఒకే చెప్పాడు. పండుగ తరువాత ఇద్దరూ కలిసి బెంగుళూరుకు వెళ్ళారు. ఒకే గదిలో ఇద్దరూ ఉండేవారు. సతీష్‌కు అప్పటికే పెళ్ళయ్యింది. ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్య ప్రియాంక హౌస్ వైఫ్. ఉద్యోగం రావడంతో భార్యను ఇంటి దగ్గరే వదిలి సతీష్ బెంగుళూరుకు వెళ్ళాడు. ఇద్దరు స్నేహితులు ఒకే గదిని అద్దెకు తీసుకుని ఉండేవారు. వీరు పనిచేస్తున్న సంస్ధలోకి స్రవంతి అనే యువతి వచ్చి చేరింది.
 
కొత్తగా ఉద్యగంలో చేరడంతో హేమంత్ తన స్నేహితుడు సతీష్‌ను పరిచయం చేశాడు. ఆమెకు ఎలాంటి అనుమానాలు ఉన్నా సతీష్ తీర్చేవాడు. ఇలా వారిద్దరి మధ్య చనువు పెరిగింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. సతీష్‌లో వస్తున్న మార్పును గమనించాడు హేమంత్. ప్రాణ స్నేహితుడు కావడంతో అతన్ని మందలించాడు. అతడికి పెళ్ళయిన విషయాన్ని గుర్తు చేశాడు. అయినా సతీష్‌లో మార్పు రాలేదు. 
 
రెండురోజుల క్రితం గదిలో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. సతీష్, హేమంత్‌లకు మధ్య ఆ అమ్మాయి విషయంపై తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. దీంతో సతీష్ ఆవేశంతో వంట గదిలోని కత్తితో హేమంత్‌ను అతి దారుణంగా పొడిచి చంపేశాడు. గదిని మూసివేసి యధావిధిగా ఉద్యోగానికి వెళ్ళాడు. అయితే హేమంత్ ఫోన్లో టచ్‌లో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బెంగుళూరుకు వెళ్ళి గదిలో చూడగానే హత్యకు గురైన విషయాన్ని గమనించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణ జరిపిన పోలీసులు స్నేహితుడే హంతకుడన్న విషయాన్ని తెలుసుకుని అతన్ని అరెస్టు చేశారు.