శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:58 IST)

పక్షం రోజుల్లో ప్రజలు తమ ఆస్తుల వివరాలు నమోదు చేయాలి : సీఎం కేసీఆర్

సరిగ్గా పక్షం రోజుల్లో రాష్ట్రంలోని ప్రజలందరూ తమతమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అంటే.. కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ధరణి పోర్టల్ తమతమ ఆస్తుల వివరాలను నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. 
 
ఈ ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కాని ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
 
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే లోపే మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల్లోని సిబ్బంది ఇప్పటివరకు నమోదవ్వని ఆస్తుల వివరాలను నూటికి నూరు శాతం ఆన్‌లైన్ చేయాలని స్పష్టంచేశారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. భూ రికార్డుల నిర్వహణ 100 శాతం పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ధరణి పోర్టల్ కు శ్రీకారం చుడుతున్నామన్నారు.
 
అలాగే, 'ధరణి' పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోగా మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన అన్నిస్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదుకాని ఆస్తుల వివరాలను వందశాతం ఆన్‌లైన్‌ చేయాలి. డీపీవోలు.. ఎంపీడీవోలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలి. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో అధికారులకు సహకరించాలని కోరారు.