1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (13:26 IST)

రేవంత్ రెడ్డి మళ్లీ హౌస్ అరెస్టు : ప్రగతి భవన్లు - ఫామ్‌హౌస్‌లు బద్ధలైపోతాయ్...

తెలంగాణ రాష్ట్ర పాలకులకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు మరోమారు హౌస్ అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమానికి పోకుండా పోలీసులతో అడ్డుకున్నారు. దీంతో ఆయన్ను మరోమారు ఇంటికే పరిమితం చేశారు. 
 
ఈ చర్యపై రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. పౌర స్వేచ్ఛను కేసీఆర్ పోలీసులతో సహకారంతో అణిచివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్‌కు వెన్నులో వణుకు మొదలైందన్నారు. తాము ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే కేసీఆర్‌కు ముచ్చెమటలు పోస్తున్నాయని, అందుకే పోలీసులను ఉసిగొల్పుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడం తప్పా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. నీవు, నీ మంత్రులూ ఎలాగూ రైతులను పరామర్శించలేరు. ఆ ధైర్యం కూడా మీకు లేదు. ఆ పని తాము చేస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు, కీడు కార్యాలకు వెళ్లి గంటల సమయం గడిపే నీకు రైతుల చావు కేకలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. త్వరలోనే ఈ ప్రగతి భవన్లు, ఫామ్‌హౌస్‌లు బద్ధలైపోతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.