బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 మార్చి 2020 (14:37 IST)

కరోనా వైరస్ కల్లోలం, కేసీఆర్ ఆర్మీ-కనిపిస్తే కాల్చివేత వార్నింగ్, తెలంగాణ జనం వింటున్నారా?

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షలు చేస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ పాటించాలని చెప్పినప్పటికీ కొందరు రోడ్లపై ఎలాంటి పట్టింపులేని ధోరణిలో తిరుగుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కొన్ని దేశాల్లో ప్రజలు చెప్పిన మాట వినకపోతే సైన్యాన్ని దించుతుందనీ, అప్పటికీ వినకపోతే కనిపిస్తే కాల్చివేత ఆదేశాన్ని ఇస్తుందనీ, తనను అలాంటి స్థితిలోకి నెట్టవద్దని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తూ అడుగుతున్నాను... దయచేసి ఎవరి ఇళ్లలో వారు వుండండి.

కరోనా వైరస్ అరికట్టేందుకు అందరూ సమిష్టిగా పోరాటం చేయాలి. లేదంటే ఈ మహమ్మారి దొంగదెబ్బ తీస్తుంది. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలి.
 
తెలంగాణలో మరో 114 మంది అనుమానితున్నారని, వారి నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న కేసులు ఏప్రిల్ 7వ తేదీ కల్లా కోలుకుని డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. ప్రభుత్వపరంగా తాము చేయాల్సిందంతా చేస్తున్నామనీ, ప్రజలు సహకరిస్తేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలుగుతామని అన్నారు. కాగా ఈరోజు నుంచి తెలంగాణలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం కాస్త తగ్గిందన్న సమాచారం అందుతోంది.