శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (14:39 IST)

వాసన - రుచి తెలియడం లేదా.. అయితే కరోనా పరీక్షలు చేయించుకోండి...

సాధారణంగా కరోనా వైరస్ సోకిన రోగుల్లో జలుబు, దగ్గు, జ్వరంతో పాటు.. గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా కరోనా సోకినట్టుగా నిర్ధారించుకోవచ్చు. కానీ, ఇపుడు మరో లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కరోనా వైరస్ సోకిందని భావించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని బ్రిటీష్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ సైంటిస్టుల లెక్క ప్రకారం... చెవి, ముక్కు, గొంతు డాక్టర్ల  అధ్యయనంలో కరోనా పేషంట్లలలో పైలక్షణాలే కాకుండా మరో రెండు కొత్త వాటిని గుర్తించారు. వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి కూడా కోవిడ్ 19 సోకిన బాధితుల్లో కనిపించాయని వారు చెబుతున్నారు.
 
దీనిపై బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త హాప్‌కిన్స్ మాట్లాడుతూ.. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన వారిపై రీసెర్చ్ చేయగా.. వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలను గుర్తించామని అన్నారు. ఇరాన్, దక్షిణ కొరియా, చైనా, ఇటలీలలో ఈ వ్యాధి సోకిన వారిని టెస్ట్ చేసినప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం ఇంతవరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని గుర్తుచేశారు. 
 
మరోవైపు, 174 దేశాల్లో సోమవారం నాటికి 15,873 మంది మృతి చెందారు. 3,50,142 మందికి వైరస్‌ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. 50కి పైగా దేశాలు 170 కోట్ల మంది ప్రజలను ఇండ్లకే పరిమితం కావాలని కోరాయి. తాజాగా మరణాల్లో చైనా కంటే ముందు ఇటలీ ఉన్నది. ఆ దేశంలో సోమవారం నాటికి 6,077 మంది మృత్యువాత పడగా, 63,927 మందికి సోకింది. 
 
చైనాలో స్థానికంగా కేసులు నమోదు కావడం నిలిచిపోయింది. కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారిలో 39 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో చైనాలో మృతుల సంఖ్య 3,270కు చేరగా, 81,093 మందికి వైరస్‌ సోకింది. స్పెయిన్‌లో 2,207 మంది, ఇరాన్‌లో 1,812, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 501 మంది మరణించారు.