1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (11:46 IST)

ట్విన్ సిటీస్‌లో నేటి నుంచి స్పెషల్ వ్యాక్సినేషన్ : ఇంటికొచ్చే టీకా వేస్తరు

తెలంగాణా రాష్ట్రంలోని జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో సోమవారం నుంచి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి 10 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్‌ను వైద్య ఆరోగ్య శాఖ, కంటోన్మెంట్ బోర్డుతో కలిసి నిర్వహించనుంది.
 
గ్రేటర్​లోని 4,846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్​లోని 360 వాడలు, కాలనీల్లో ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే సిటీలో 70 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన వాళ్లకు వేసేందుకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లనున్నారు. దాదాపు 200 స్పెషల్ ​మొబైల్ ​కొవిడ్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతుంది.
 
జంట నగరాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు బల్దియా ఈ డ్రైవ్ చేపట్టింది. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ సిబ్బంది, ఆశ, అంగన్ వాడీ, ఎంటమాలజీ టీమ్స్.. ముందుగా కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి టీకా వేసుకోని వారి జాబితాలు సేకరించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఇంటింటికీ వెళ్లి మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ల షెడ్యూల్ పాంప్లెట్స్ ​పంపిణీ చేస్తారు. 
 
వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఆయా కాలనీలు, బస్తీలు 100 శాతం వ్యాక్సినేటెడ్ అని బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆయా కాలనీ సంఘాలకు బల్దియా ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేస్తుందన్నారు. ఈ డ్రైవ్​ను బల్దియా ఉన్నతాధికారులతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తారు.