1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (10:59 IST)

అత్యంత ప్రమాదకారిగా హుస్సేన్ సాగర్ - లోతట్టు ప్రాంతాలు ఖాళీ...

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా, మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరం పూర్తిగా నీట మునిగింది. నగరంలోని మురికి కాలువలు పొంగి పోర్లుతున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్‌కు ఒక్కసారిగా భారీగా వర్ష, వరద నీరు వచ్చి చేరింది. ఫలితంగా హుస్సేన్ సాగర్ నీటి మట్టం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 
 
దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. దాదాపు సగం నగరంలో కురిసే వర్షమంతా హుస్సేన్ సాగర్ జలాశయానికి, అక్కడి నుంచి మూసీ నదిలోకి వెళుతుందన్న సంగతి తెలిసిందే. గత వారంలో కురిసిన వర్షాలకే జలాశయం పూర్తిగా నిండిపోగా, మంగళవారం ఉదయం నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా భారీ వరదగా హుస్సేన్ సాగర్‌లోకి వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం గేట్లను ఎత్తాలని నిర్ణయించిన జలమండలి అధికారులు, లోతట్టు ప్రాంతాలైన అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
 
మరోవైపు, భాగ్యనగరంలో భారీగా కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద ప్రవాహం వచ్చి చేరడంతో హుస్సేన్‌సాగర్, హిమాయత్‌ సాగర్ ప్రమాదకరంగా మారింది. హుస్సేన్ సాగర్ గరిష్టనీటిమట్టానికి చేరింది.
 
 దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.