బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (12:01 IST)

సీఎం సార్‌ని నిలదీయాటానికే తెలంగాణలో కొత్త పార్టీ.. వైఎస్ షర్మిల క్లారిటీ

తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టబోతున్నారనే ఖమ్మంలో సంకల్ప సభలో వైఎస్‌ షర్మిల క్లారిటీ ఇచ్చారు. 18 ఏళ్ల క్రితం ఏప్రిల్ 9న తన తండ్రి చేసిన పాదయాత్రను గుర్తు చేసుకుంటూ.. ఉద్యమాల గుమ్మం ఖమ్మంలో తెలంగాణ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నానో చెప్పారామె. 
 
తన తండ్రి చేసిన అభివృద్ధి గురించి చెబుతూ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ.. అధికార పార్టీ పని తీరుపై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేజీ టూ పీజీ విద్య ఏమైందని.. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న హామీ ఎక్కడని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఊసే లేదన్న ఆమె.. సీఎం సార్‌ని నిలదీయాటానికే తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నానని కుండ బద్దలు కొట్టారు. 
 
కొత్త పార్టీ పెట్టేందుకు ఇంకా టైమ్ ఉందంటూ.. ఈ గ్యాప్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న లక్షా తొంభై ఆరువేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంపై గళమెత్తేందుకు రెడీ అవుతున్నారు షర్మిల. 
 
నిరుద్యోగం కారణంగా.. ప్రతిరోజూ ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశారామె. ప్రభుత్వం దిగి వచ్చేలా.. ఈనెల 15 తేదీ నుంచి హైదరాబాద్‌లో దీక్షలు చేస్తానని చెప్పారు షర్మిల. పనిలో పనిగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలనూ టార్గెట్‌ చేశారు షర్మిల. 
 
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేలను సప్లయ్‌ చేసే పార్టీగా మారిందని.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అమ్ముడు పోయిందని షర్మిల ఆరోపించారు అటు బీజేపీపైనా నిప్పులు చెరిగారు షర్మిల. తెలంగాణలో బలపడేందుకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.