ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:18 IST)

తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ.. ఖమ్మంలో సంకల్ప సభ.. 6వేల మందికే పర్మిషన్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో అనేక చోట్ల ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి సారించడంతో షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 9 వ తేదీన అంటే ఇవాళ ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారు అని సమాచారం.
 
ఇందులో భాగంగానే శుక్రవారం ఖమ్మంలో షర్మిల సభను నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ సభకు సంబంధించిన రూట్ మ్యాప్ ను షర్మిల అనుచరుడు పిట్టా రామిరెడ్డి ప్రకటించారు. ఆరోజు ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరి కోటి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట, చివ్వేంల మీదుగా వెళ్తారని అన్నారు. 
 
ఇవే కాకుండా పలువురు గ్రామస్తులు తమ గ్రామం వద్ద ఆగాలని కోరుతున్నారని సమయాన్ని బట్టి చూస్తామని అన్నారు. కోదాడ, నుంచి పాలేరుకు 3.30కి చేరుకుంటారని, పెద్ద తండాలో వైస్సార్ విగ్రహం నుంచి ర్యాలీగా పెవిలియన్ గ్రౌండ్ కి షర్మిల చేరుకుంటారని అన్నారు.
 
సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు జరిగే ఈ సభలో షర్మిల తన కొత్త పార్టీని ప్రకటించనున్నారు. షర్మిల సభకు తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. లక్ష మందితో సంకల్ప సభను నిర్వహించాలని షర్మిల టీమ్ మొదట భావించింది. 
 
కానీ ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బహిరంగ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. షర్మిల సభ నేపథ్యంలో ఖమ్మంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.