1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (09:14 IST)

అప్పటికే పెళ్లయింది.. అయినా ఆ అమ్మాయిపై మనసుపడ్డాడు.. చివరకు...

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తనను ప్రేమ పేరుతో ఓ వివాహితుడు మోసం చేయడాన్ని జీర్ణించుకోలేని ఆ యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లాలలోని మాలబంజరకు చెందిన డిగ్రీ విద్యార్థిని తంబల్ల రత్నకుమారి(24) అనే యువతి ఖమ్మంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో సహాయకురాలిగా చేస్తూ వచ్చింది. 
 
ఆ సమయంలో నగరానికి చెందిన ఆటో డ్రైవర్‌ కర్రి సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. కానీ అతనికి అప్పటికే పెళ్లయింది. ఈ విషయాన్ని రత్నకుమారికి సంజయ్ చెప్పలేదు. పైగా, యువతి అందంగా ఉండటంతో సంజయ్ కూడా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. 
 
ఇంతలో కొత్తగూడెంలో ఉంటున్న సొంత బావమరిది కర్ణ ప్రకాశ్‌ వచ్చి రత్నకుమారిని మందలించాడు. ఇప్పటికే పెళ్లయిన తన బావతో సన్నిహితంగా ఎందుకు ఉంటున్నావని బెదిరించాడు. అసలు విషయం తెలిసి మనస్తాపం చెందిన రత్నకుమారి ఈ నెల 8న స్వగ్రామానికి వచ్చింది. 
 
మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు కొత్తగూడెం, అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఆమె అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి బాబాయి ఫిర్యాదుతో సంజయ్‌, అతని బావమరిది ప్రకాశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.