గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (13:23 IST)

ఫాంహౌజ్‌లో రింగరింగా.. వీడియోలు వైరల్‌.. 12 మందిపై కేసు

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఉందాహిల్స్‌లో ఓ ఎంఐఎం నేత నిర్వహించిన రేవ్ పార్టీ ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన ఈ రేవ్ పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మజ్లిస్‌ పార్టీకి చెందిన నేతలు యువతులు, హిజ్రాలతో చిందులు వేయడం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ అయ్యింది. ఈ ఉదంతంలో 12 మందిపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వివరాలను పరిశీలిస్తే, పాతబస్తీ బండ్లగూడకు చెందిన మహమ్మద్‌ పర్వేజ్‌ అనే వ్యక్తి మజ్లిస్‌ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా ఉండే నేత. బండ్లగూడ గౌస్‌నగర్‌ ఉందాహిల్స్‌ చెరువు సమీపంలో నూతనంగా ఓ ఫాంహౌస్‌ను నిర్మించాడు. ఫిబ్రవరి 13న ఆ ఫాంహౌస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రేవ్‌పార్టీని ఏర్పాటు చేశాడు. 

దీనికి మజ్లిస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు, పర్వేజ్‌ స్నేహితులు హాజరయ్యారు. రేవ్‌ పార్టీలో నలుగురు యువతులు, నలుగురు హిజ్రాలూ పాల్గొన్నారు. పర్వేజ్‌ సహా మిగతా వారందరూ మద్యంతాగి వారితో చిందులు వేసినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. 

వారితో యువతులు అశ్లీల నృత్యాలు చేసినట్లుగానూ ఉంది. ఈ మేరకు ఫలక్‌నుమా ఏసీపీ ఎం.ఎ.మజీద్‌ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్‌, డీఐ ప్రసాద్‌వర్మ ఫాంహౌస్‌ను పరిశీలించారు. పర్వేజ్‌తో సహా 12 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ రేవ్‌పార్టీ వీడియోలను మంగళవారం ప్రత్యర్థి పార్టీల నేతలు వైరల్‌ చేయడంతో ఈ ఉదంతంపై మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ఒవైసీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. పర్వేజ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.