గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:14 IST)

లాక్డౌన్ అంటూ అచ్చం నకిలీ ఆర్డర్లు సృష్టించిన సీఏ కేటుగాడు అరెస్టు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళ‌ల్లో లాక్డౌన్ విధిస్తున్న‌ట్లు అచ్చం ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసిన మాదిరిగా న‌కిలీ ఉత్త‌ర్వుల‌ను రూపొందించి వైర‌ల్ చేసిన యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
నాలుగు రోజుల క్రితం శ్రీపతి సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ నకిలీ జీవోను సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యేలా చేసిన‌ట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియా స‌మావేశంలో తెలిపారు. నిందితుడి నుంచి ఓ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని వివ‌రించారు. 
 
అత‌డి స్వస్థలం నెల్లూరు అని, ఓ ప్రైవేటు సంస్థ‌లో ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఇక్కడ పని చేస్తున్నాడని తెలిపారు. తెలంగాణ‌లో గ‌త ఏడాది లాక్డౌన్‌పై ప్ర‌భుత్వం ఇచ్చిన‌ జీవోను డౌన్‌లోడ్‌ చేసుకున్న శ్రీప‌తి అందులో మార్పులు చేసి కొత్త జీవోగా దాన్ని సృష్టించార‌ని అంజ‌నీ కుమార్ చెప్పారు.
 
అనంత‌రం ఆ న‌కిలీ జీవోను సంజీవ్‌తో పాటు అతడి స్నేహితులు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారని తెలిపారు. ఇటువంటి త‌ప్పుడు ప్ర‌చారాల‌ను ఎవ్వ‌రూ షేర్ చేయొద్ద‌ని, నిజాన్ని నిర్ధారించుకోకుండా షేర్ చేసిన వారిపై కూడా కేసులు న‌మోదు చేస్తామ‌ని, పైగా, కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.