1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (11:00 IST)

ప్రియుడితో ముద్దు పెట్టించుకున్న వధువు.. ఠాణాలో వదిలేసివెళ్లిన భర్త

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హుజూరాబాద్‌కు చెందిన యువతికి మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. వధువు హుజురాబాద్‌కే చెందిన వంశీ అనే యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రుల మాట కాదనకుండా పెళ్లికి  అంగీకరించింది. 
 
ఇది తెలిసిన వంశీ సదరు యువతితో కలిసి ఉన్న ఫొటోలు, ప్రేమలేఖలను వరుడికి పంపించి పెళ్లి చేసుకోవద్దని బెదిరించాడు. అయితే వాటిని పట్టించుకోకుండా వధూవరుల తల్లిదండ్రులు వీరి వివాహం జరిపించారు. ఈ క్రమంలో బరాత్‌ ముగిసిన వెంటనే సోమవారం రాత్రి వాహనంలో వరుడి ఇంటికి వెళ్తున్నారు. 
 
ప్రియురాలి సమాచారంతో వంశీ జమ్మికుంట రోడ్డులో వాహనాన్ని అడ్డగించి వరుడి ఎదురుగానే ముద్దుపెట్టుకొని ఆమెను వదిలిపెట్టి వెళ్లాలని గొడవకు దిగాడు. దీంతో వరుడి తరపు బంధువులు అదే రాత్రి పోలీసులను ఆశ్రయించారు. అర్థరాత్రి వరకు కౌన్సెలింగ్‌ చేసిన ఇరువర్గాల వారు వినకపోవడంతో వరుడు.. వధువును పోలీసుస్టేషన్‌లోనే వదిలేసి మందమర్రికి వెళ్లిపోయాడు. 
 
ఇటు వధువు తల్లిదండ్రులు సైతం ఆమెను ఠాణాలోనే వదిలి వెళ్లారు. పోలీసులు సదరు వధువును కరీంనగర్‌లోని స్వధార్‌ హోంకు తరలించారు. ముద్దు పెట్టుకొని వివాదానికి కారణమైన వంశీపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు తెలిపారు.