1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (11:40 IST)

హుజురాబాద్‌లో ఓటర్లకు కిక్కే కిక్కు.. ఏరులై పారుతున్న మద్యం

తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. తెరాస మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ సెగ్మెంట్‌లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఉప ఎన్నికకు ఈసీ పచ్చజెండా ఊపడంతో మద్యం మరింత ఏరులైపారనుంది. అలాగే, ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నికను అదే రోజున నిర్వహించనున్నారు. 
 
ఇప్పటికే రికార్డుస్థాయిలో మద్యం అమ్ముడుపోతుండగా.. పార్టీలు, కులసంఘాలు, సమావేశాలు ఏవైనా మద్యం కిక్కు తప్పనిసరిగా మారింది. ఐదు మాసాలుగా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో రూ.వందల కోట్లలో లిక్కర్‌ అమ్మకాలు జరుగుతన్నాయి. ఈ ప్రభావం మరో రెండునెలలు ఉండనుంది. మొత్తంగా ఉప ఎన్నిక నేపథ్యంలో దసరాకు ముందే ఇక్కడివారికి కిక్కు ఎక్కుతోందని చెప్పుకుంటున్నారు. 
 
హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వేడి ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట ఎక్సైజ్‌ సర్కిల్‌లో మొత్తం 29 దుకాణాలున్నాయి. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు రూ.125 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. 2021లో రూ.170 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదికన్నా సుమారు రూ.45 కోట్ల వ్యాపారం అధికంగా జరిగింది.
 
గతేడాది ఆగస్టు వరకు రూ.3.60 లక్షల బీర్లు, లిక్కర్లు అమ్ముడవగా, ప్రస్తుతం లిక్కరు, బీర్లు కలిపి 3,92,616 కేసుల మద్యం అమ్ముడైంది. ముఖ్యంగా గత మూడు నెలల నుంచే రెట్టింపు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లామొత్తం రూ.320 కోట్ల వ్యాపారం జరగ్గా.. 55 శాతం అమ్మకాలు ఇక్కడే జరగడం విశేషం. నోటిఫికేషన్‌తో అమ్మకాల జోరు మరింత పెరగనుంది.