మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 జులై 2023 (08:17 IST)

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్

rain
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. బుధవారం ఉదయంలోగా వాయుగుండం మారే అవకాశాలు ఉన్నాయని గోపాల్ పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ విపత్తు ప్రభావం 30వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు ఉంటుందని, రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. 
 
దీని ప్రభావం కారణంగా తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కడలి కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదన్న హెచ్చరికలు జారీచేశారు. గడిచిన 24 గంటల్లో దక్షిణ ఒడిశా అంతటా ఆగాగి వర్షాలు కురిశాయి. కొరాపుట్‌ జిల్లా కొట్పాడ్‌లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. 
 
గజపతి జిల్లా గుసానిలో 6, కాశీనగర్‌లో 5, గంజాం జిల్లా సురడలో 5, గజపతి జిల్లా పర్లాఖెముండిలో 4, కొంధమాల్‌ జిల్లా ఖజరియాపదలో 4, మయూర్‌భంజ్‌ జిల్లా రరునాలో 4, ఇతర కేంద్రాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వాన కురిసిందన్నారు. బుధవారం మల్కాన్‌గిరి, కొరాపుట్‌, గజపతి, గంజాం జిల్లాల్లో అతిభారీ వర్షాలకు అవకాశం ఉన్నందున 'ఆరెంజ్‌' హెచ్చరికలు చేశామన్నారు.