1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (14:40 IST)

పాలంపేట నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల ప్రచారం..

rahul - priyanka
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమైంది. పాలంపేట నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంక వాద్రా కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
 
తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ములుగు దగ్గర జరిగే తొలి సభలో రాహుల్ పాల్గొంటారు.
 
ములుగులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను రాహుల్ ప్రకటించనున్నారు. సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోలపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలి సభ కావడంతో.. విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 
 
స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. గత నెలలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రకటించారు. 
 
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలపై విస్తృత ప్రచారం కల్పించనున్నారు. ఇందుకోసం బస్సు యాత్రలు చేపట్టారు. ప్రియాంక, రాహుల్ గాంధీ వీటిని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో మూడు రోజుల పాటు కొనసాగనుంది. 
 
యాత్ర సందర్భంగా ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ పట్టణాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. భూపాలపల్లి, మంథని, కరీంనగర్‌, నిజామాబాద్‌లో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.
 
మహిళలు, రైతులు, నిరుద్యోగులు, వ్యాపారవేత్తలతో రాహుల్ గాంధీని కలిసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఆరు హామీలతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న కీలక సంస్కరణలపై రాహుల్, ప్రియాంక ప్రకటన చేయనున్నారు.
 
ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కార్మికులు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై రాహుల్ గాంధీ ఆయా వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించేలా చూసుకుంటున్నారు.