1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (08:54 IST)

హద్దులు లేని మోసం : రెమ్‌డెసివిరి ఇంజెక్షన్‌లో నీళ్లు కలిపి విక్రయం...!!

కరోనా రోగులపాలిట సంజీవినిగా మారిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ మందుకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఈ మందును అధిక మొత్తంలో వినియోగిస్తుండటంతో ఒక్కసారిగా కొరత ఏర్పడింది. దానికితోడు ఈ మందు పేరుతో జరిగే మోసాలు కూడా ఎక్కువై పోతున్నాయి. 
 
తాజాగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌లో నీళ్లు నింపి మోసానికి పాల్పడిన వైద్యుడు, కాంపౌండర్‌ను తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి రెమ్‌డెసివిర్ అవసరమని వైద్యులు చెప్పారు. 
 
దీంతో రోగి బంధువులు ఓ మధ్యవర్తి ద్వారా రూ.85 వేలు వెచ్చించి ఓ మధ్యవర్తి ద్వారా ఐదు వయల్స్ కొని తీసుకొచ్చి వైద్యులకు ఇచ్చారు. వాటిని చూసిన వైద్యులు అనుమానంతో పరీక్షించగా, ఇంజక్షన్ సీసాల్లో నీళ్లు నింపినట్టు గుర్తించారు. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీకాకుళానికి చెందిన ఆన్‌కాల్ వైద్యుడు సాయి కృష్ణమనాయుడే ఈ పనికి పాల్పడినట్టు గుర్తించారు. ఖాళీ రెమ్‌డెసివిర్ సీసాల్లో నీళ్లు నింపి కాంపౌండర్ సతీశ్‌గౌడ్ ద్వారా రోగులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. విచారణలో సాయి కృష్ణమనాయుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
 
నిజామాబాద్‌లోనే జరిగిన మరో ఘటనలో ఔట్ సోర్సింగ్ నర్సు ఎలిజబెత్ అలియాస్ స్రవంతి రెమ్‌డెసివిర్ ఇంజక్షను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ పట్టుబడింది. ఆసుపత్రి నుంచి రెండు ఇంజక్షన్లను అక్రమంగా తీసుకొచ్చిన స్రవంతి వాటిని తన భర్తకు అందజేసింది. అతడు ఓ రోగికి రూ.89 వేలకు విక్రయిస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. స్రవంతిని పోలీసులు అరెస్ట్ చేశారు.