1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:28 IST)

పర్యాటక హబ్ గా కాకతీయుల ప్రతాపరుద్రుని కోట

నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన కాకతీయుల ప్రతాపరుద్రుని కోటను పర్యాటక హబ్ గా మార్చనున్నట్లు జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ ప్రకటించారు.
 
ఆదివారం అటవీ శాఖ అధికారులతో కలిసి దాదాపు 280 అడుగుల ఎత్తునున్న ప్రతాప రుద్రుని కోటను కాలి నడకతో కలెక్టర్ శర్మన్ సందర్శించి పరిశీలించారు.

కోట పరిసర ప్రాంతాల వివరాలను జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టగౌడ్ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. నల్లమల్ల అటవీ ప్రాంతంలో 700 సంవత్సరాలకు పైగా 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల సౌధం ప్రతాపరుద్రుని కోటకు హంగులు తీర్చిదిద్ది పర్యాటక హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు.
 
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ప్రకృతి సహజ వనరులతో దేశంలో ప్రసిద్ధి వన్యప్రాణుల అభయారణ్యంలో ఒకటిగా గుర్తింపు ఉందన్నారు.

నల్లమల ప్రాంతంలో అనేక అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాలు నల్లమల్ల అందాలను, పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు పరిశీలించి ప్రత్యేక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 
 
నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలోని మేడిమల్కల సమీపంలోని కదలి వనాన్ని అలాగే ఫరహాబాద్ వ్యూ పాయింట్ ను కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. 

గతంలో పర్యాటక ప్రాంతంగా కొనసాగిన ఈ రెండు ప్రాంతాల తోపాటు నల్లమల్ల ఇతర పర్యాటక ప్రాంతాలను పర్యాటక హబ్ గా పునరుద్ధరించేందుకు, వీటికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి  ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు.

త్వరలోనే పనులను చేపట్టి పూర్తి చేసి శ్రీశైలం వెళ్లే యాత్రికులకు అందుబాటులో తీసుకురావడం కోసం నల్లమల్ల పర్యాటకంగా ఆహ్లాదకరమైన సుందర ప్రదేశాలను పర్యాటకంగా తీర్చిదిద్ది  అందించేందుకు ప్రజాప్రతినిధుల సహకారంతో కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.