శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (14:03 IST)

మీకు క్లాసులు తీసుకుంటా అంటూ స్కూలు ఫీజులపై గళమెత్తిన నటుడు

కరోనా కష్టకాలంలోనూ పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆన్‌లైన్ తరగతులు, పరీక్షల నిర్వహణ పేరుతో నిర్బంధ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూలు యజమాన్యం తీరుపై టాలీవుడ్ నటుడు శివబాలాజీ గళమెత్తారు. ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా ఈ పాఠశాల యాజమాన్యం బలవంతంగా ఫీజులు వసూలు చేస్తోందంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని, గవర్నమెంట్ ఆదేశాలను బేఖాతర్ చేస్తోందని ఆరోపించారు. ఫీజు వసూలు కోసం అనవసర పరీక్షలు కూడా నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. 
 
ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తుందని, ఎదురు తిరిగి అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, 'మీరు పిల్లలకు క్లాసులు తీసుకోవడం కాదు, నేను మీకు క్లాసులు తీసుకుంటా' అంటూ శివబాలాజీ ఘాటుగా హెచ్చరించారు.