శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (08:42 IST)

బీజేపీలోకి మరో ఇద్దరు నేతలు

మరో ఇద్దరు నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు, సిట్టింగ్‌లు, మాజీలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేసి కాషాయ కండువా కప్పేసుకున్నారు.

అయితే తాజాగా తెలంగాణలో ఒకప్పుడు కీలక నేతలుగా ఓ వెలుగు వెలిగిన రేవూరి ప్రకాష్‌రెడ్డి, రవీంద్రనాయక్ ఇద్దరూ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాతో లక్ష్మణ్ భేటీ కానున్నారు.

లక్ష్మణ్‌తోపాటు ఢిల్లీకి రేవూరి, రవీంద్ర నాయక్ వెళ్తున్నారు. షా ఆధ్వర్యంలో పార్టీలో ఆ ఇద్దరు నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. ఆర్టికల్ 370 రద్దు పరిణామాలపై తెలంగాణలో 35 సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ నెల 17న మోదీ జన్మదినం సందర్భంగా.. 14 నుంచి 20 వరకు సేవా వారం కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై పోరాటం ఉధృతం చేయాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది.

బీజేపీ బలం చూసి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తోందని మనోహర్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ క్లస్టర్‌లు ఏర్పాటు చేసి పోరాడుతామని మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు.