గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (16:57 IST)

మెగాస్టార్‌కు విలన్‌గా కలెక్షన్ కింగ్ : పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా? (Video)

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సివుంటుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవికి ప్రతినాయకుడుగా సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమైతే.. చిరంజీవి - మోహన్ బాబులు 30 యేళ్ల తర్వాత వెండితెరను షేర్ చేసుకోనున్నారు. గతంలో వీరిద్దరూ పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా, బిల్లా - రంగా, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి చిత్రాల్లో హీరోలుగా కలిసి నటించారు. ఆపై చిరంజీవి సినిమాల్లో మోహన్ బాబు, విలన్‌గా తనదైన విలక్షణ శైలిలో మెప్పించారు కూడా.  
 
అయితే, బాహ్య ప్రపంచంలో వీరిద్దరి మధ్య సంబంధాలు అంతగా బాగోలేవనే ప్రచారం సాగుతోంది. అయితే, పలు వేదికలపై వీరిద్దరూ కనిపించినపుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తామిద్దరం మంచి స్నేహితులమని పదేపదే చెపుతున్నారు. అదేసమయంలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటుంటారు. అయినా తామిద్దరమూ ఒకటేనని, విభేదాలు పైకి మాత్రమే ఉంటాయని, తమ కుటుంబాలు రెండూ ఒకటేనని ఇద్దరూ చెబుతుంటారు.
 
ఈ పరిస్థితుల్లో ఇక చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించనున్నారన్నది ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో మోహన్ బాబు ఓ పవర్‌ఫుల్ రాజకీయ నేత పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ వార్తపై అధికారిక సమాచారమైతే ఇంతవరకూ వెలువడలేదుగానీ, అదే నిజమైతే, ఇద్దరి కాంబినేషన్ అదిరిపోతుందన్నది మాత్రం వాస్తవం.