సినీ ఛాన్సులు లేక.. మతిస్థిమితం కోల్పోయి ముంబై రోడ్లపై అడుక్కుంటున్న హీరోయిన్!
సినిమా అనేది ఒక రంగుల లోకం. ఎవరి జీవితాలనైనా ఒక రాత్రికే మార్చేయగల సత్తా ఉన్న రంగం సినీరంగం. కొందరిని అందని ఆకాశానికెత్తేస్తుంది, మరికొందరిని పాతాళానికి తొక్కేస్తుంది. కొందరు అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని స్థిరపడితే, మరికొందరు ఇక్కడ సెటిల్ కాలేక అటు తిరిగి ఇంటికి వెళ్లలేక తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇంతకీ అసలు విషయానికొస్తే బాలీవుడ్లో హీరోయిన్గా తన సత్తాని చాటుకోవాలని ఎన్నో ఆశలతో వచ్చిన ఓ అమ్మాయి హీరోయిన్ అయినా ఆ ఛాన్స్ నిలుపుకోలేక ఇప్పుడు ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటోంది.
పూర్తి వివరాలకు వెళితే ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మకు సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా తానూ సినిమాలో హీరోయిన్ అవ్వాలనుకుంది. సినిమాలపై మోజుతో తల్లిదండ్రులు కాదన్నా ఆ రంగుల లోకంలోకి అడుగుపెట్టింది. అనుకున్నట్టే హీరోయిన్ అయింది. ఓ భోజ్పురి సినిమాలో హీరోయిన్గా నటించింది. అయితే ఆ సినిమా బోల్తా కొట్టడంతో ఆమెకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి ఇంటికి వెళ్లలేక తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక నానా అవస్థలు పడింది.
ఇంట్లో వాళ్ళకు మొహం చూపించలేక తనలో తానే బాధపడి చివరికి మతిస్థిమితం కోల్పోయి తిండి కోసం ముంబై నగర వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ బ్రతుకుతోంది. ఒకరోజు ఆమె ఒష్విరా హౌసింగ్ సొసైటీలో నిలిచి ఉన్న కారు అద్దాలను పగులగొడుతూ పోలీసుల కంట పడింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని గమనించిన మహిళా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె కన్నీటి కథ వెలుగులోకి వచ్చింది.