1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (14:20 IST)

పరశురాం లక్కీఛాన్స్ : మహేష్ బాబు చిత్రానికి దర్శకత్వం?

టాలీవుడ్‌కు పరిచయమైన కొత్తకారు దర్శకుల్లో పరశురాం ఒకరు. ఈయన "గీత గోవిందం" సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. పైగా, మంచి పేరుకూడా కొట్టేశాడు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం రూ.100 కోట్లకుపైగా వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. దీని తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్నాడు. కథతో అల్లు అర్జున్‌ని ఒప్పిస్తే తాను సినిమా నిర్మించడానికి సిద్ధం అని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. 
 
కానీ బన్నీ ఇతర డైరెక్టర్‌లలో మూడు ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పడంతో ఇది వర్క్ అవుట్ కాలేదు. దీంతో కాసింత నిరుత్సాహానికి లోనైన పరశురాంకు మరో రకంగా లక్ కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. కథ మంచిదైతే తాను సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నానని మహేష్ బాబు అన్నారట. అయితే మహేష్ బాబు, సుకుమార్ మూవీ రద్దయిన వెంటనే అల్లు అరవింద్ వెళ్లి మహేష్ బాబు భార్య నమ్రతను కలిశారట. 
 
సుకుమార్, అల్లు అర్జున్ సినిమా విషయంలో క్లారిఫికేషన్ ఇచ్చేందుకే అతడు వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో మహేష్ బాబుతో సినిమా చేయాలనే ఉద్దేశంతో వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ పరశురాం వద్ద మంచి కథ ఉందని, మహేష్ బాబుకు సూటువుందని, కథ విని ఒకే చెబితే తాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారట. ప్రస్తుతం పరశురాం మహేష్ బాబు మెప్పించే విధంగా స్క్రిప్ట్ తయారు చేయడంలో బిజీ అయిపోయారట.