'కన్నప్ప' రిలీజ్కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు
డాక్టర్ మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కన్నప్ప". ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు మంచు విష్ణుకు జీఎస్టీ అధికారులు షాకిచ్చారు. మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 'కన్నప్ప' సినిమాకి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్టు అనుమానించిన అధికారులు ఈ తనిఖీలు చేశారు. అంతకుముందు జీఎస్టీ తనిఖీలపై విలేకరులు ప్రశ్నించగా విష్ణు స్పందించారు. మీరు చెప్పే వరకూ నాకు తెలియదు అయినా.. దాచిపెట్టేదేమీ లేదు.. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది కదా అని అన్నారు.
ఇకపోతే 'కన్నప్ప' చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, హిందీలో ఫైనల్ కాపీ చూశా. సినిమా ఆఖరిలో రోమాలు నిక్కబొడుకుంటున్నాయని అక్కడ కొందరు ప్రముఖులు అన్నారు. ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారని ఆశిస్తున్నా. దేవుడు భక్తుడు మధ్య జరిగే కథ ఇది. 'కన్నప్ప' గురించి ఈతరానికి తెలియాలన్న ఉద్దేశంతో తెరకెక్కించాం అని తెలిపారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు కన్నప్పగా నటించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు కాజల్ అగర్వాల్లు కీలక పాత్రలు పోషించారు.