గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (10:13 IST)

ఆసక్తి కలిగించిన రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం టీజర్ : హను రాఘవపూడి

Praveen Kandela, Hanu Raghavapudi, Shrikant Rathod, Jaiyetri Makana
Praveen Kandela, Hanu Raghavapudi, Shrikant Rathod, Jaiyetri Makana
జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం. ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న ఈ చిత్రానికి సంతోష్ మురారికర్ కథ అందించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశారు. టీజర్ చూసిన అనంతరం బాగుందని ప్రశంసించారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
 
రెండు నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. 'నా పేరు కుమార్.. ఇది నా ఊరు.. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు.. కానీ మనం ఆడింది వందే' అంటూ ప్రారంభమైన టీజర్ అందరిలోనూ ఓ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. 'వంద మంది.. బరా బర్ వంద మందిని చూపించాలి'.. 'అన్నా ఇదంతా నిజంగా అయితదా?.. అయితది.. ఏం కావాల్నో అదే అయితది'.. 'ఈ పని ఒక్కడే చేయగలడు సర్.. అయితే ఇదంతా మీకు తెలిసే జరుగుతాందా?' అనే ఈ డైలాగ్స్‌తో సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్పేశారు.
 
అసలు ఏం జరుగుతోంది.. ఆ వంద అబద్దాలు ఏంటి? ఆ వంద మంది కలిసి చేసిన పని ఏంటి?.. తుపాకుల గూడెంలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా సినిమా టీజర్‌ను యూనిట్ కట్ చేసింది. ఈ టీజర్‌లో శ్రీకాంత్ అర్పుల కెమెరాపనితనం అద్భుతంగా కనిపిస్తోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ ఈ సినిమాకు పని చేయడం విశేషం. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. జైదీప్ విష్ణు దర్శకుడు కూడా కావడంతో ఎక్కడ ఎలాంటి కట్స్ కావాలి..ఏ ఏ షాట్స్ ఉండాల్లో తెలుసు. కాబట్టి ఎడిటర్‌గానూ అద్భుతంగా ఈ టీజర్‌ను కట్ చేశారు జై దీప్ విష్ణు.
 
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న థియేటర్లోకి రానుంది.