1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:05 IST)

పవన్ వీరాభిమానిని కానీ ఇమేజ్‌కు తగిన విధంగా సినిమా తీయలేను : వర్మ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తాను వీరాభిమానని దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే, పవన్ హీరోయిజంకు తగిన విధంగా తాను సినిమాలు తీయలేనని చెప్పారు. ఎందుకంటే.. పవన్ సినిమాలను తాను ఎక్కువగా చూడలేదని... తాజా చిత్రం 'వకీల్ సాబ్'ను కూడా చూడలేదని చెప్పారు. 
 
'దెయ్యం' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'దెయ్యం' సినిమాలో రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
 
వకీల్ సాబ్ సినిమా చూడలేదనీ, కానీ ట్రైలర్ చూశానని, చాలా బాగుందని చెప్పారు. సినిమాకు వచ్చిన రివ్యూల గురించి కూడా విన్నానని తెలిపారు. పవన్ హీరోగా సినిమా చేయడం తనకు చేత కాదని పేర్కొన్నారు. 
 
వకీల్ సాబ్ సక్సెస్‌పై వర్మ మాట్లాడుతూ, పవన్‌ను ఉన్న ఇమేజ్, హీరోయిజం, ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు ఆయన అభిమానులు అంచనాలను అందుకునే విధంగా తాను సినిమా చేయలేనని చెప్పారు. 
 
హీరోయిజం చూపించే కమర్షియల్ చిత్రాల కంటే జోనర్ చిత్రాలను తాను ఎక్కువగా తెరకెక్కిస్తానని... పవన్‌తో సినిమా చేయలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని తెలిపారు. తాను తీసే సినిమాలలో స్టార్ హీరోలను తీసుకుంటే అది వాళ్లకే కాకుండా సినిమాకు కూడా మంచిది కాదని అన్నారు.