గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 10 మార్చి 2019 (13:19 IST)

కథల ఎంపికలో తెలివిగా ఉన్నానంటున్న 'మహానటి'

Keerthy Sureshసీనియర్ నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. ఈ చిత్రంలో నటించడం వల్ల కీర్తి సురేష్‌కు ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఒక్కసారిగా స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 
 
ఈ చిత్రం ఒక్క తెలుగులోనేకాకుండా తమిళంలో కూడా కీర్తి సురేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కీర్తీ నటన గురించి ఎవరు మాట్లాడినా 'మహానటి' చిత్ర ప్రస్తావనరాకుండా ఉండదు. ఆ చిత్రం తర్వాత కొన్ని కమర్శియల్‌ చిత్రాల్లో కీర్తి నటించినా ప్రస్తుతం తన నట జీవితం నిదానంగానే సాగిపోతోంది. 
 
ఈ క్రమంలో 'మహానటి' చిత్రం తర్వాత కీర్తి ఇప్పటివరకు కేవలం ఒక్కో చిత్రంలోనే నటించింది. ఇక తమిళంలో 'సర్కార్‌' చిత్రం తర్వాత మరో చిత్రం ఈ బ్యూటీ చేతిలో లేదు. ఇదే విషయాన్ని కీర్తీసురేశ్‌ ముందుంచితే దక్షిణాదిలో తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. ఇది సంతోషకరమైన విషయమేనని అంది. ప్రతీ చిత్రానికి ఎదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లు పేర్కొంది. 
 
ఇక నటీనటులు వారు ఎంచుకునే కథలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని అంది. కొందరు నటీమణులు పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అలాంటివారు ఎంచుకుని నటించే చిత్రాలపై ఆసక్తి అధికం అవుతుందని అంది.
 
'మహానటి' చిత్రం తర్వాత తన పరిస్థితి అదేనని చెప్పింది. తానిప్పుడు ఏ చిత్రంలో నటించినా వాటిపై ప్రేక్షకుల మధ్య అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పింది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది తనకు చిన్నతనం నుంచే ఉందని అంది. అందుకే కథల ఎంపికలో చాలా తెలివిగా ఉన్నానని చెప్పింది. కథలో ఎంపికలో తొందర పడదలుచుకోలేదని తెలిపింది. తన విజయ రహస్యమని ఆమె చెప్పుకొచ్చింది.