మంగళవారం, 22 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఆ సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది : నయనతార

nayanathara - vignesh
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో వచ్చిన నేను రౌడీనే చిత్రం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని హీరోయిన్ నయనతార అన్నారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నయనతార ఓ ప్రత్యేక పోస్ట్‌ చేశారు. తన భర్త, సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్‍‌కు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశారు. 
 
"నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం. నా కెరీర్‌ను గొప్పగా మలచిన సినిమా 'నేను రౌడినే'. 9 యేళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను ఇచ్చింది" అని రాసుకొచ్చారు. 
 
ఇక ఈ చిత్రం గురించి గతంలో విఘ్నేశ్‌ మాట్లాడుతూ.. "నేను రౌడినే' సినిమాలో హీరోయిన్‌గా నయనతార అయితే బాగుంటుందని ధనుష్‌ చెప్పారు. దీంతో ఆమెకు కథ వినిపించాను. వెంటనే ఓకే చేసింది. చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ యేడాదంతా ఆమెతో ఉండే అవకాశం వచ్చింది. తన ఇష్టాయిష్టాలను తెలుసుకునే సమయం దొరికింది" అని చెప్పారు.
 
కాగా, 2015లో విడుదలైన 'నేను రౌడినే'లో విజయ్‌సేతుపతి హీరోగా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌లోనే నయనతార, విఘ్నేశ్‌లు స్నేహితులయ్యారు. వారి స్నేహం ప్రేమగా మారింది. ఇది విడుదలైన ఏడేళ్ల తర్వాత 2021లో వీళ్ల ప్రేమను మీడియా ముందు చెప్పారు. 2022 జూన్‌ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటకు ఉయిర్‌, ఉలగమ్‌ అనే ట్విన్స్‌ ఉన్నారు.