1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

మా వదిన సురేఖ నాకు ద్రోహం చేశారు.. అందుకే ఇక్కడ ఉన్నాను : పవన్ కళ్యాణ్

pawankalyan
మా వదిన సురేఖ నాకు ద్రోహం చేశారంటూ జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన అతిథి పాత్రలో నటించిన చిత్రం "బ్రో". సాయి ధరమ్ తేజ్ హీరో. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 'ఖుషీ' చిత్రం కోసం వైజాగ్ జగదాంబ సెంటరులో బస్సు పైకప్పుపై చిత్రీకరణ చేస్తున్న సమయంలో నాకు సిగ్గేసింది. నలుగురిలో నటించలేక ఏడుపొచ్చిందన్నారు.  
 
మా వదినకు ఫోన్ చేసి 'నువ్వెందుకు నన్ను సినిమాల్లోకి పంపించావ్ అని అడిగాను. "ఆ రోజు మా వదిన చేసిన తప్పు.. ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది. ఆమె చేసిన ద్రోహం గురించి మాటల్లో చెప్పలేను అని నవ్వుతూ అన్నారు. ఆ తర్వాత అన్నయ్యను మించి కష్టపడాలని నిర్ణయించుకున్నా. శారీరకంగా కష్టపడేవాణ్ని. నేను మొరటు మనిషిని. నాకు తెలిసిదల్లా త్రికరణ శుద్ధితో పనిచేయడం. అదే కోట్లాది అభిమానుల్ని సంపాదించి పెట్టిందన్నారు. 
 
ఒకే కుటుంబం నుంచి ఇంతమంది హీరోలు వచ్చారంటే చాలామందికి ఇబ్బందిగా అసూయగా ఉండొచ్చు. కానీ, మేమంతా గొడ్డు చాకిరి చేస్తాం. ప్రేక్షకులను అలరించేందుకు నిరంతరం శ్రమిస్తాం. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి, సినిమా రంగంలోకి అడుగుపెట్టి కథా రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్ గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. 
 
తెలుగు సినిమాని రాజమౌళి వంటి దర్శకులు హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు. రాబోయే తరం దర్శకులు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. అందరు హీరోల అభిమానుల్ని నేను ఇష్టపడతా. ఎందుకంటే ఒక్కో హీరో సినిమా చేయడం వల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. సినిమా చేసేటప్పుడు మాత్రం మిగతావారికంటే పెద్ద హిట్ కొట్టాలని అనుకుంటా. ఆ విషయంలో కాంప్రమైజ్ కాను. పోటీతత్వం ఉండాలి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్ లాంటి విజయాలు సాధించాలని ఉంటుంది. కానీ, నేను పూర్తిగా నటనవైపు మనసు పెట్టడంలేదు. టాలీవుడ్‌లో ఆరోగ్యకర వాతావరణం ఉండాలని ఆకాంక్షిస్తున్నా అని చెప్పారు.