ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (19:26 IST)

టాలీవుడ్‌లో ముగిసిన కార్మికుల సమ్మె - రేపటి నుంచి షూటింగులు

Cinema hall ph
తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. వేతనాలను పెంచాలని కోరుతూ సినీ నిర్మాణ కార్మికులు చేపట్టిన సమ్మెను గురువారం విరమించుకున్నారు. దీంతో శుక్రవారం నుంచి వారు తిరిగి షూటింగుల్లో పాల్గొననున్నారు. 
 
వేతనాల పెంపుపై నిర్మాతల మండలి వైపు నుంచి స్పష్టమైన హామీ రావంతో సమ్మెను విరమిస్తున్టన్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో నిర్మాతల మండలితో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఇందులో సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటల పాటు వీరు చర్చించారు. 
 
ఈ చర్చలు సానుకూలంగా ముగిశాయి. పైగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మంలి ప్రకటించింది. ఈ కమిటీ కూడా శుక్రవారం సమావేశమై కమిటీతో చర్చించి, వేతనాల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటుందని, అందువల్ల కార్మికులంతా యథావిధిగా షూటింగులకు హాజరుకావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. దీంతో సినీ కార్మికులు తలపెట్టిన సమ్మె 48 గంటలు కూడా పూర్తికాకముందే ముగిసిపోయింది.