శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

అంకులేంట్రా.. అంకులే.. కేసు వేస్తా.. అభిమానికి బ్రహ్మాజీ వార్నింగ్

brahmaji
ఓ అభిమానికి నటుడు బ్రహ్మాజీ వార్నింగ్ ఇచ్చారు. తనను అంకుల్ అని పిలవడమే ఆ అభిమాని చేసిన తప్పు. ఆ ఫ్యాన్ నోటి వెంట నుంచి అంకుల్ అనే పదం వినగానే బ్రహ్మాజీకి చిర్రెత్తుకొచ్చింది. అంకులేంట్రా.. అంకుల్.. కేసు వెస్తానంటూ హెచ్చరించారు. దీంతో నెటిజన్లు బ్రహ్మానీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మీరెంత బెదిరించినా "ఆంటీ"కి వచ్చినంత హైప్ రాదంటూ నెటిజన్లు తనదైనశైలిలో సెటైర్లు వేస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారిలో బ్రహ్మాజీ ఒకరు. ఆయన ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఈ క్రమంలో 'వాట్స్ హ్యాపెనింగ్' (ఏం జరుగుతోంది?) అని తన సెల్ఫీని పోస్టు చేస్తూ అభిమానులను అడిగాడు. 
 
అది చూసిన ఓ అభిమాని 'ఏం లేదు అంకుల్' అని బదులిచ్చాడు. ఆ రిప్లై చూసిన బ్రహ్మాజీ దానిని రీ ట్వీట్ చేస్తూ 'అంకులేంట్రా అంకుల్. కేసు వేస్తా, బాడీ షేమింగ్ చేస్తున్నావా?' అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. అంతే.. క్షణాల్లోనే అది వైరల్ అయింది. అభిమానులు సరదా కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తించారు.
 
ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారని ఒకరంటే.. ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆ ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదని ఇంకొకరు కామెంట్ చేశారు. '#SayNotToOnlineAbuse అనే హ్యాష్‌ట్యాగ్‌ మర్చిపోయారు అంకుల్’ అని మరొకరు.. ఇలా కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తనను ఆంటీ అని సంబోధించిన నెటిజన్లపై కేసులు పెడతానని హెచ్చరించిన ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ అన్నట్టుగానే రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అలా హెచ్చరించిన తర్వాత ట్విట్టర్‌లో ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. మీమ్స్‌తో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.