శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (17:56 IST)

డ్రగ్ స్కామ్ సిగ్గుపడాల్సిన విషయం కాదు.. ఫిల్మ్ ఛాంబర్‌ తీరును కడిగిపారేసిన వర్మ

తెలుగు చిత్ర పరిశ్రమ తీరును వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏకిపారేశారు. ఈ మేరకు ఆయన తెలుగు ఫిల్మ్ చాంబర్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలోని పూర్తి వివరాలను పరిశీలిస్తే...

తెలుగు చిత్ర పరిశ్రమ తీరును వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏకిపారేశారు. ఈ మేరకు ఆయన తెలుగు ఫిల్మ్ చాంబర్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలోని పూర్తి వివరాలను పరిశీలిస్తే...
 
"సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం డ్రగ్ స్కాండల్ కాదు.. ఆ డ్రగ్ స్కాండల్‌కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చేవిధంగా అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేశామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు చెప్పడంగానీ ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి క్షమాపణ చెప్పినట్టు?
 
అపాలజీ లెటర్‌లో ఒక వాక్యం"అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం"- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేశారో? అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహానేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రెడీ నేరం ఋజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థమేంటి?
 
అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం "మీలో ఏ మాత్రం-పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా, జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలి. విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైనది కావచ్చేమో కానీ, అసలు నేరారోపణలు కూడా నమోదు కానీ ఇలాంటి సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ ఉంది. ఒకవేళ అలా మాట్లాడటం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి, అన్యాయంగా కేసులు బనాయించి చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం".
 
అలాగే రేపు ఫైనల్‌గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్‌కి ఏ మాత్రం విచక్షణ ఉన్నా అధికారులకి బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లందరికీ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ చెప్పాలి. ఇలా చెయ్యనిపక్షంలో భావి చరిత్రలొ వీళ్లందరూ నిజంగా నేరస్థులేనని... కానీ ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణమూలానే క్షమించి వదిలేశారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుంది.. ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్‌కి ఉందని గౌరవపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను.
 
ఇట్లు.. 
రాంగోపాల్ వర్మ.