Harika Suryadevara, Suryadevara Naga Vamsi, Narne Nithin, Sangeet Shobhan
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా వస్తున్న 'మ్యాడ్ స్క్వేర్'పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్, అందులోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్'పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో 'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సినీ అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ నవ్వులు పూయించింది. మొదటి భాగంతో పోలిస్తే రెట్టింపు వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నామని ట్రైలర్ తో మరోసారి రుజువైంది.
ట్రైలర్ ను గమనిస్తే, మ్యాడ్ విజయానికి కారణమైన ప్రత్యేక శైలి హాస్యం, ప్రధాన పాత్రల అల్లరిని మ్యాడ్ స్క్వేర్ లో కూడా చూడబోతున్నామని అర్థమవుతోంది. హాస్యాస్పదమైన సంభాషణలు మరియు విచిత్రమైన పరిస్థితులతో మ్యాడ్ స్క్వేర్ వినోదాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ట్రైలర్ కు ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచింది. విడుదలైన నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, గత వారం నుంచి చూస్తున్నాను.. ట్రైలర్ ఇంకా రాలేదని అందరూ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా వచ్చామని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మార్చి 28న థియేటర్ కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం. ఈ వేసవి సెలవుల్లో పెద్ద విజయాన్ని అందుకుంటామనే నమ్మకం ఉంది." అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, "సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. టికెట్ కొని థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ తాము పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని భావిస్తారు." అన్నారు.
కథానాయకుడు నార్నే నితిన్ మాట్లాడుతూ, "ఏడాదిన్నర క్రితం మ్యాడ్ సినిమాతో మీ ముందుకు వచ్చాము. మేము కొత్తవాళ్ళం అయినప్పటికీ మాకు మంచి విజయాన్ని అందించారు. ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నాం. ఈసారి వినోదం రెట్టింపు ఉంటుంది. మార్చి 28న సినిమా చూసి ఆనందించండి." అన్నారు.
కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, "ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా కూడా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది." అన్నారు.
కథానాయకుడు రామ్ నితిన్ మాట్లాడుతూ, "మ్యాడ్ సమయంలో మీడియా ఎంతో సపోర్ట్ చేసింది. మ్యాడ్ 2 కి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది." అన్నారు.
'మ్యాడ్ స్క్వేర్' చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి, 'స్వాతి రెడ్డి', 'వచ్చార్రోయ్' పాటలు చార్ట్బస్టర్ లుగా నిలిచాయి.
ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్దత్ అద్భుత కెమెరా పనితనం, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ ప్రతిభ తోడై.. వెండితెరపై భారీ వినోదాన్ని అందించడానికి మ్యాడ్ స్క్వేర్ సిద్ధమైంది.
మ్యాడ్ సినిమాతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్, సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ప్రధాన పాత్రలు పోషించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం మొదటి భాగానికి మించిన అల్లరి చేయబోతున్నారు.
మ్యాడ్ స్క్వేర్ ను శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది.
భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న థియేటర్లలో అడుగు పెట్టనున్న మ్యాడ్ స్క్వేర్, ఈ వేసవికి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుంది.