మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (15:37 IST)

కాంగ్రెస్‌ను గెలిపించేందుకు పాకిస్థాన్ కుట్ర : బీజేపీ

కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బీజేపీ బహిర్గతం చేసింది. ఈనెల 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న

కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బీజేపీ బహిర్గతం చేసింది. ఈనెల 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చూసి, కాంగ్రెస్ తిరిగి గెలిచేలా చేయాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, ఇందుకోసం స్వయంగా రంగంలోకి దిగిందని బీజేపీ ఆరోపించింది. దీనికి సాక్ష్యంగా టిప్పు సుల్తాన్ 218వ వర్థంతి సందర్భంగా పాక్ ప్రభుత్వం, తన అధికార ట్విట్టర్ ఖాతాలో పెట్టిన రెండు పోస్టులను బీజేపీ బహిర్గతం చేసింది.
 
కాంగ్రెస్ కోరిక మేరకే పాక్ కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. కర్ణాటకలోని ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసేందుకు పాక్ నడుం బిగించి ఈ ట్వీట్లు పెట్టిందని ఆ పార్టీ అధికారిక ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. 1947 తర్వాతనే తమ చరిత్ర మొదలైనట్టు చెప్పుకునే పాక్, ఉన్నపళంగా టిప్పు సుల్తాన్‌పై ఇంత ప్రేమ కురిపించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 
 
కాగా, పాక్ ప్రభుత్వం తన ట్వీట్లలో టిప్పును ఆకాశానికి ఎత్తేసింది. ఆయన అంతులేని జ్ఞానసంపద ఉన్న వ్యక్తని, పులినే తన అధికార చిహ్నంగా చేసుకున్న ధైర్యశాలని పొగిడింది. బ్రిటీష్‌ సైన్యం ఎదుర్కొన్న అతి గొప్ప శత్రు సారథుల్లో టిప్పు సుల్తాన్ ఒకరని, ఫ్రెంచ్‌ వారు అడిగితే, ఓ చర్చి నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారని గుర్తుచేసింది.