గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (21:16 IST)

కరోనా నిర్బంధంలో మనిషి : పక్షులు - జంతువులకు సంపూర్ణ స్వేచ్ఛ

ప్రకృతిని మనిషి బంధించాడనే విషయం ఇపుడు తేటతెల్లమైంది. ఒక మనిషిని స్వీయ నిర్బంధంలో ఉంచితే ప్రకృతిలోని అనేక జంతువులు, పక్షులు, వన్యప్రాణాలు, మృగాలకు ఎంత స్వేచ్ఛ వస్తుందో ఈ కరోనా నిరూపించింది. కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. దీంతో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. పైగా, మనిషి సృష్టించిన సాంకేతకత సంచారం కూడా తగ్గిపోయింది. ఇదే పక్షులు జంతువులు ఇప్పుడు స్వేచ్చగా సంచరించేలా చేస్తున్నాయి. తాజాగా ముంబైలో వలస పక్షులు ఫ్లెమింగోలు పండుగ చేసుకుంటున్నాయి.
 
ముంబైలోని అరేబియా సముద్రతీరం వెంబడి ఉండే చిత్తడి ప్రదేశాలకు ప్రతి ఏటా వేలసంఖ్యలో ఫ్లెమింగోలు వస్తుంటాయి. ఈసారి వాహనాలుగానీ, మనుషుల సంచారంగానీ లేకపోవటంతో లక్షల సంఖ్యలో వచ్చిన ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయి. గతేడాదికంటే ఈ సంవత్సరం 25 శాతం ఎక్కువ ఫ్లెమింగోలు వలసవచ్చాయని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్‌ దీపక్‌ ఆప్టే వెల్లడించారు.
 
ముంబై చుట్టుపక్కల ప్రస్తుతం లక్షన్నరదాకా ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇవి గుజరాత్‌లో ఖచ్‌ నుంచి, రాజస్థాన్‌లోని సాంబార్‌ సరస్సుతోపాటు పాకిస్థాన్‌, ఆప్ఘనిస్థాన్, ఇజ్రాయేల్‌ దేశాల నుంచి కూడా వలస వస్తాయని గుర్తుచేశారు. ఈ ఫ్లెమింగోల ఫోటోలను బాంబే నాచురల్‌ హిస్టరీ సొసైటీ ట్విటర్‌లో పోస్టు చేయటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తెగలైకులు కొడుతున్నారు.