ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:49 IST)

రూ.కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన తితిదే... కారణం? (video)

దేశంలో ప్రఖ్యాత దేవస్థానంగా గుర్తింపు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వందలాది కోట్ల రూపాయల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. దీనికి కారణం కరోనా వైరస్ కారణంగా భక్తుల దర్శనం నిలిపివేయడమే. ఈ ఒక్క కారణంతో తితిదే ఏకంగా రూ.300 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీనికితోడు.. తిరుమల గిరులపైకి కరోనా ప్రవేశించకుండా ఉండేందుకు వీలుగా తితిదే ఘాట్ రోడ్లను మూసివేసింది. అలాగే, భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసింది. దీంతో కొండపై భక్తుల సందడిలేక బోసిబోయి కనిపిస్తున్నాయి. ఘాట్ రోడ్లపై వన్యప్రాణులు, క్రూర మృగాలు యధేచ్చగా సంచరిస్తున్నాయి. 
 
అయితే, ఈ లాక్‌డౌన్ అన్ని రంగాలపై ఏ విధంగా ప్రభావం చూపిందో అలాగే తితిదే ఆదాయంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా గత నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ.300 కోట్ల ఆదాయాన్ని శ్రీవారు కోల్పోయారు. ఇది 2020-21 సంవత్సర బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్చ చర్యల్లో భాగంగా, మార్చి 19వ తేదీ నుంచి టీటీడీ ఘాట్‌ రోడ్లను మూసివేయడంతో పాటు 20వ తేదీ మధ్యాహ్నం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేసిన విషయం తెల్సిందే. ప్రధానంగా వివిధ ఆర్జితసేవా టిక్కెట్లు, ప్రసాదాలు, వసతి గదుల కేటాయింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని టీటీడీ కోల్పోయింది.
 
అలాగే తలనీలాల ద్వారా వచ్చే ఆదాయం, దుకాణాలు, హోటళ్ల ద్వారా వచ్చే బాడుగల రాబడులు కూడా ఆగిపోయాయి. టీటీడీ ఆదాయ వనరుల్లో శ్రీవారి హుండీ ఆదాయం ప్రధానమైంది. నెలకుపైగా దర్శనాలు నిలిపివేయడంతో దాదాపు రూ.100కోట్ల పైగా ఆదాయం కోల్పోయింది. ఇలా మొత్తంగా దాదాపు రూ.300కోట్లకు పైగా టీటీడీ ఆదాయానికి గండిపడినట్లైంది.