గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (19:31 IST)

శ్రీరామ జన్మస్థలం మార్చుకోవడం సాధ్యంకాదు... బాబర్ చేసింది చారిత్రక తప్పిదం

శ్రీరామ జన్మస్థలం మార్చుకోవడం సాధ్యపడదని సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఓ హిందూపార్టీ తెలిపింది. అదేసమయంలో అయోధ్యలో శ్రీరాముని జన్మ స్థలంలో మసీదును నిర్మించడం ద్వారా మొఘలు చక్రవర్తి బాబర్ చారిత్రక తప్పిదం చేశారన్నారు. అందువల్ల ఈ తప్పును సరిదిద్దవలసిన సమయం ఆసన్నమైందని గుర్తుచేశారు. 
 
కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి వివాదంపై విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. పిటిషనర్లు మహంత్ సురేశ్ దాస్ తరపున సీనియర్ అడ్వకేట్ కె.పరాశరన్ మంగళవారం వాదనలు వినిపించారు. 
 
ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయోధ్యలో 50 నుంచి 55 మసీదులు ఉన్నాయని, ముస్లింలు ఈ మసీదులలో నమాజు చేసుకోవచ్చన్నారు. హిందువులు శ్రీరాముని జన్మ స్థలాన్ని మార్చుకోవడం సాధ్యం కాదని ధర్మాసనానికి పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు.
 
ముఖ్యంగా, బాబర్ చక్రవర్తి భారతదేశాన్ని స్వాధీనం చేసుకుని, శ్రీరాముని జన్మ స్థలంలో మసీదును నిర్మించి, తనను తాను చట్టానికి అతీతంగా భావించారని పరాశరన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 
 
రామ జన్మభూమి వివాద స్థలం 2.77 ఎకరాలను మూడు సమాన భాగాలుగా చేసి, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు పంచాలని అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పుచెప్పింది. ఈ తీర్పుపై 14 అపీళ్ళు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై రోజువారీ విచారణ జరుగుతుండగా, మంగళవారంతో ఈ విచారణ 39వ రోజుకు చేరుకుంది.