శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (16:43 IST)

సారథికి సెలవు : పాడె మోసిన చంద్రబాబు... చితికి నిప్పంటించిన కళ్యాణ్ రామ్

చైతన్య రథ సారథి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక సెలవ్ అంటూ వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య నందమూరి హరికృష్ణ అంత్యక్రియల ఘట్టం గురువారం సాయంత్రం ముగిసింది. రథ సారథి పార్థివదేహాన్ని చితిపై ఉంచి హి

చైతన్య రథ సారథి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక సెలవ్ అంటూ వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య నందమూరి హరికృష్ణ అంత్యక్రియల ఘట్టం గురువారం సాయంత్రం ముగిసింది. రథ సారథి పార్థివదేహాన్ని చితిపై ఉంచి హిందూ సంప్రదాయం ప్రకారం కైంకర్యాలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, లోకేష్, తారక్, కల్యాణ్ రామ్ ఇతర కుటుంబ సభ్యులంతా విచార వదంనంతో నిలబడి చివరి చూపు చూశారు. పిమ్మట హరికృష్ణ రెండో కుమారుడు కల్యాణ్ రామ్ తండ్రి చితికి నిప్పంటించారు. తెలంగాణ పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి, వందనం సమర్పించారు.
 
అంతకుముందు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మెహిదీపట్నంలోని నివాసం నుంచి హరికృష్ణ పార్థివదేహాన్ని పాడెపై ఉంచి బయటకు తీసుకొచ్చారు. ఈ పాడెను సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌ మరికొందరు వైకుంఠ వాహనం వరకు మోశారు. 
 
మెహిదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకు వేలాది మంది అభిమానుల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. మెహిదీపట్నం, రేతీబౌలి, టోలిచౌకి, షేక్‌పేట్‌ నాలా విస్పర్‌ వ్యాలీ మీదుగా మహాప్రస్థానం చేరుకుంది. హరికృష్ణను కడసారి చూసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరుగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
 
మహాప్రస్థానానికి చేరుకున్న తర్వాత హరికృష్ణ పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి తన భుజంపై మోసుకొచ్చి చితిపై పెట్టారు. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం... తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. హరికృష్ణ పార్థివదేహాన్ని గంధపు చెక్కలతో దహనం చేశారు. 
 
ఇదిలావుంటే, నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించిన కేసీఆర్ సర్కారు... ఇపుడు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది.
 
మహా ప్రస్థానంలో‌ నందమూరి హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన అంత్యక్రియలను మొయినాబాద్‌లో ఫాం హౌస్‌లో నిర్వహించాలని కుటుంబసభ్యులు అనుకున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరాం అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పడంతో వేదికను మార్చారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించారు.