1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (10:37 IST)

దేశంలోనే తొలిసారి నీటిపై నడిచే మెట్రో రైల్.. ఎక్కడ..?

water metro
సాధారణంగా దేశంలోని పలు నగరాల్లో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు నీటిపై నడిచే మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ సేవలకు కేరళ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ వాటర్ మెట్రోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 25వ తేదీన ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. మరి ఈ వాటర్ మెట్రో రైలు ఎలాంటి సేవలు అందిస్తుందో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
కేరళ రాష్ట్రం కలల ప్రాజెక్టుగా వాటర్ మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టారు. కోచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ దీని నిర్వహణ బాధ్యత చూసుకుంటుంది. కోచి వాటర్ మెటర్లో సర్వీస్‌లో బ్యాటరీల సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినళ్ళను నిర్మించారు. కోచి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ ఈ వాటర్ మెట్రో రాకపోకలు సాగిస్తుంది.
water metro
 
ఈ ప్రాజెక్టు కోసం రూ.1136.83 కోట్లను వెచ్చించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇది పూర్తిగా విద్యుత్ సాయంతో పనిచేస్తుంది. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. అలాగే, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. 
 
వాటర్ మెట్రో సర్వీస్‌తో కోచి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేరళ ప్రభుత్వం భావిస్తుంది. దశల వారీగా ఈ సర్వీసు సంఖ్య పెంచుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 12 గంటల పాటు ఈ మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నారు.
water metro
 
ఇందులో ఏసీ, వైఫై సౌకర్యం ఉంది. ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్టంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతోను, గరిష్టంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అత్యాధునిక భద్రత, సమాచార వ్యవస్థ వీటిలో ఉన్నాయి. 
 
కోచి వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభ టిక్కెట్ ధరను రూ.20 కాగా, గరిష్ట టిక్కెట్ ధరను రూ.40గా నిర్ణయించారు. టిక్కెట్లతో పాటు వారం, నెలవారీ, మూడు నెలల పాస్‌లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వారం రోజుల పాస్ ధర రూ.180గాను, నెలవారీ పాస్ ధర రూ.600, మూడులల పాస్ ధర రూ.1500గా ఖరారు చేశారు.